యాపిల్ కు భారత్ అద్భుతమైన మార్కెట్: టిమ్ కుక్

  • భారతదేశంలో మధ్య తరగతి కుటుంబాల సంఖ్య పెరుగుతోందన్న టిమ్ కుక్
  • గత త్రైమాసికంలో ఇక్కడ కంపెనీ రికార్డు స్థాయిలో వృద్ధిని సాధించిందని వెల్లడి
  • యాపిల్ బ్రాండ్ పై ఇండియన్లకు ఉన్న ఆసక్తిని తాను గమనించినట్లు వ్యాఖ్య
యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్.. భారత మార్కెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాపిల్ కు భారత్ అద్భుతమైన మార్కెట్ అని అన్నారు. తమ కంపెనీ ప్రధానంగా ఇక్కడి విపణిపై ద‌ృష్టిపెట్టిందని తెలిపారు. మార్చిలో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పని తీరుపై గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆయన మాట్లాడారు. 

ఒకప్పటితో పోలిస్తే భారతదేశంలో మధ్య తరగతి కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని టిమ్ కుక్ అన్నారు. దీంతో వీరిలో కొందరైనా ఐఫోన్లు కొనే అవకాశం ఉందని చెప్పారు.

మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో భారత్ లో యాపిల్ రికార్డు స్థాయిలో వృద్ధిని సాధించిందని టిమ్ కుక్ చెప్పారు. యాపిల్ బ్రాండ్ పై ఇక్కడి ప్రజలకు ఉన్న ఆసక్తిని తాను ఇటీవలి పర్యటనలో గమనించినట్లు వివరించారు. ఈ సమావేశంలో దాదాపు 20 సార్లు భారత్ గురించి ఆయన ప్రస్తావించడం గమనార్హం. 

ఇటీవల మన దేశంలో రెండు యాపిల్ రిటైల్ స్టోర్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. తొలుత ముంబైలో, తర్వాత ఢిల్లీలో ఔట్ లెట్లను టిమ్ కుక్ స్వయంగా ప్రారంభించారు. తన భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు.

tim cook
Apple CEO
indian market
I Phone
retail outlets

More Telugu News